DGP | హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలు, ప్రొబేషనరీ అసిస్టెంట్ ఎస్పీలతో డీజీపీ డాక్టర్ జితేందర్ బుధవారం సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్లకు ఇన్చార్జిలుగా పని చేస్తున్న వారితో ఆయా ప్రాంతాల్లోని శాంతిభద్రతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఎస్పీలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. తద్వారా పోలీస్ స్టేషన్లోకి వచ్చే బాధితులతో పోలీస్ సిబ్బంది వ్యవహరించే తీరు తెలుసుకోవచ్చని చెప్పారు. అదేవిధంగా కేసుల దర్యాప్తులో నైపుణ్యం సంపాదించవచ్చని సూచించారు. పనితీరును సమర్థంగా నిర్వహిస్తే దాదాపు మరో 30 సంవత్సరాల పాటు ఐపీఎస్ అధికారులుగా ఈ అనుభవం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఐపీఎస్ అధికారులను ప్రజలు ఇతర ఏజెన్సీలు గమనిస్తుంటాయని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయాలన్నారు. అసిస్టెంట్ ఎస్పీలు క్రమశిక్షణతో, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగైనందున తన పరిధిలోని పోలీస్ స్టేషన్ల తనిఖీ సులభమవుతుందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులను పట్టుకున్నప్పుడు ముఖ్యమైన నేరస్థులు ఎవరో తెలుసుకోవడం ద్వారా డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించవచ్చని చెప్పారు. అసిస్టెంట్ ఎస్పీలు చురుగ్గా పనిచేస్తే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. గ్రామస్థాయి పోలీస్ అధికారులను నియమించుకోవాలని సూచించారు.
కళాశాలలు ప్రారంభం కానుండడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అసిస్టెంట్ ఎస్పీలు అనుమానాస్పద మరణాల విషయంలో 194 BNSS (174 CRPC) నిస్పాక్షిక దర్యాప్తు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లకు తనిఖీలకు వెళ్లిన సమయంలో కిందిస్థాయి సిబ్బందికి తగు సూచనలు చేయాలన్నారు. కేసుల దర్యాప్తులో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. క్రిమినల్ గ్యాంగ్స్పట్ల, దొంగతనాలు, దోపిడీల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. మానవ అక్రమ రవాణా అసలు నేరస్తులను పట్టుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మల్టీ జోన్ల ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, తఫ్సీర్ ఇక్బాల్, రమణ కుమార్, అసిస్టెంట్ ఎస్పీలు శివం ఉపాధ్యాయ, అవినాష్ కుమార్, ఎస్ శేషాద్రిని రెడ్డి, కాజల్, ఎస్ చిత్తరంజన్, చైతన్య రెడ్డి, చేతన్ నితిన్, విక్రాంత్ కుమార్ సింగ్, శుభం ప్రకాష్, రాజేష్ మీనా పాల్గొన్నారు.