హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వారోత్సవాల్లో పెద్ద ఎత్తున పౌరులు పాల్గొనేలా చొరవ తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఈ 10 రోజుల్లో ప్రతీ స్టేషన్లో ఓపెన్హౌజ్తోపాటు పోలీస్ సేవలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, వివిధ స్థాయిలోని పోలీస్ అధికారులకు కూడా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తెలిపారు. సీనియర్ పోలీస్ అధికారులు, పోలీస్ అమరుల ఇండ్లను సందర్శించి వారి బాగోగులు తెలుసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పోలీసింగ్ అంశంపై ఫొటోగ్రఫీ, స్వల్ప నిడివిగల వీడియోగ్రఫీ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలూ నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో 21న పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.