హైదరాబాద్ : మహిళలు, పిల్లల భద్రతలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పనితీరు అద్భుతంగా ఉందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. కార్యాలయంలో సోమవారం ఉమెన్ సేఫ్టీవింగ్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహిళా, శిశు భద్రతలో తెలంగాణను మరింత సురక్షితంగా నిలిపేందుకు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 750 పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్డెస్క్లు పనిచేస్తున్నాయని, త్వరలోనే అన్ని పీఎస్లలో కూడా వాటిని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామన్నారు.
12 యూనిట్లలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని, వాటిని కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. లైంగికదాడి కేసుల్లో విచారణలు వేగవంతం కావాలని, నేరం నిరూపించి శిక్షలు విధించేందుకు మరింత ఉత్సాహంగా సిబ్బంది పనిచేయాలని కోరారు. 2022లో నమోదైన లైంగికదాడి కేసుల్లో 22 కేసులకు సంబంధించి నేరస్తులను జైలుకు పంపామన్నారు.
అలాగే మహిళల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టిపెట్టామని, ఇప్పటికే గుర్తించిన హాట్స్పాట్ల ద్వారా పాత నేరస్థుల డేటా బేస్ను ఆధారం చేసుకొని, మహిళ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా షీటీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. 2022లో 6,157 ఫిర్యాదులు స్వీకరించగా వాటిల్లో 521 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, 13,471 అవగాహన శిబిరాలు నిర్వహించినట్లు డీజీపీ తెలిపారు. షీటీమ్స్ వర్టికల్స్ను మరింత బలోపేతం చేసి.. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విషయంలో బాగా పనిచేసే అధికారులను గుర్తించి రివార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ సమీక్షలో ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.