DGP Anjani Kumar | పోలీస్ స్టేషన్లకు వచ్చే పౌరులతో అమర్యాదగా ప్రవర్తించవద్దని, దాంతో మొత్తం పోలీస్శాఖకే మచ్చ వస్తుందని డీజీపీ అంజనీకుమార్ సిబ్బందికి సూచించారు. హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ అంజనీకుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్నందున శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎన్నికల వేళ వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు పాదయాత్రలు, బహిరంగ సభలు అధికంగా నిర్వహిస్తాయని ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి బందోబస్తు ఓ పరీక్షలాంటిందన్నారు. కొత్త సవాళ్లను.. సరికొత్త వ్యూహంతో పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా స్పెషల్ బ్రాంచ్ల పనితీరు అత్యంత కీలకం అన్నారు. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, జార్ఖండ్కు చెందిన వామపక్ష తీవ్రవాదపార్టీల సానుభూతి పరులు, మాజీ మిలిటెంట్లపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.
పోలీసు అధికారుల గ్రామాల సందర్శన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్న ఆయన.. మరింత పటిష్టంగా కొనసాగించాలని ఆదేశించారు. గ్రామాలకు వ్యాపించిన సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యపర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాల నివారణకుత్ప్రితి మంది పోలీసు అధికారులకు సైబర్ క్రైమ్స్ నివారణలో ప్రత్యేక్ష శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు హాట్స్పాట్లను గుర్తించి.. ఇందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నవ సమాజ నిర్మాణానికి పోలీసులు పునరంకితం కావాలని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, సంజయ్కుమార్ జైన్, విజయ్కుమార్, శిఖాగోయెల్, సందీప్ శాండిల్య, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, ఐజీలు కమలాసన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, షానావాజ్ ఖాసీం, డీఐజీ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.