హైదరాబాద్ : పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేయడంతో పాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గ్రామాల్లో విరివిగా పర్యటించాలని ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. కొత్తగా నియామకమయ్యే ట్రయినీ ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ, పోలీస్ శిక్షణా కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో బడ్జెట్ వ్యయాల సమీక్ష, రైట్ పిటిషన్లు, కోర్ట్ నిర్వహణ వ్యవహారాలు, సున్నిత ప్రాంత గ్రామాలు, పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
డీజీపీ కార్యాలయం నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్కు అడిషనల్ డీజీలు సంజయ్కుమార్ జైన్, అభిలాష బిస్త్, మహేశ్ భగవత్, ఐజీలు తరుణ్ జోషి, షానవాజ్ ఖాసిం, చంద్రశేఖర్రెడ్డి, డీఐజీ రమేశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీస్శాఖ బలోపేతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో పాటు భారీ సంఖ్యలో పోలీస్ నియామకాలను అనుమతించారన్నారు. తెలంగాణ పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, కల్పించిన సదుపాయాలు మరే ఇతర రాష్ట్రాలకు ఆయా ప్రభుత్వాలు ఇవ్వలేదని డీజీపీ గుర్తుచేశారు.
పోలీస్ నియామకాల్లో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని, త్వరలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్న దృష్ట్యా జిల్లాల్లోని అని పోలీస్ శిక్షణా కేంద్రాలను సన్నద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతీ పోలీస్ శిక్షణ కళాశాల, కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలైన తాగునీటి సరఫరా, సరిపడా టాయిలెట్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడంతోపాటు పోలీస్ శాఖ ఇమేజ్ను పెంపొందించడానికి పోలీస్ అధికారులు విరివిగా గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు. నేర పరిశోధన, శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతిక విధానాలను విరివిగా ఉపయోగించాలని అంజనీ కుమార్ సూచించారు.