హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని, సుమారు 23వేల మంది సిబ్బందితో పహారా నిర్వహిస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ శనివారం తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో, రహదారులపై పటాకులు కాల్చేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు అందరూ సహకరించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అనుమతి ఉన్నవారు తప్ప ఇతరులు ఆ పరిసరాల్లోకి రావొద్దని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున మద్యం అమ్మకాలను ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఈ నిషేధం ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు.
ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా కోరారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ఎప్పటికప్పుడు స్పెషల్ బ్రాంచ్కు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లోకి పౌరులెవరూ రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైతే పికెట్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థులకు, వారి ఆస్తులకు సైతం భద్రత కల్పించాలని తెలిపారు. రాళ్లు రువ్వడం, ఆస్తులు ధ్వంసం చేయడం వంటి ఘటనలపై దృష్టిసారించాలని సూచించారు. జిల్లాల్లోని పోలీసు ఉన్నతాధికారులు ఇరు పక్షాల రాజకీయ నాయకులతో మాట్లాడుతూ, సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కోడ్ ఎత్తివేసే వరకూ, ముఖ్యంగా ఆది, సోమవారాలు ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పాటు అగ్నిమాపకశాఖ సిబ్బంది సైతం విధులు నిర్వర్తించనున్నది. కౌంటింగ్ కేంద్రాల్లో ఫైర్ టెండర్లు, మిస్ట్ బుల్లెట్లు, మంటలు ఆర్పివేసే సిబ్బందిని మోహరించినట్టు ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికిప్పుడు పరిస్థితిని సమీక్షస్తున్నట్టు తెలిపారు. సుమారు 300 మంది సిబ్బందితో, ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.