హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ తమ వంతుగా సేవలను అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar ) పోలీస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వర్ష ప్రభావిత ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ ( Tele conference ) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికా బద్ధంగా పని చేయాలని సూచించారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల(Social Media ) ద్వారా చైతన్య పర్చాలని సూచించారు.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో పోలీస్ శాఖ నుంచి ప్రజలు తగు సహాయ సహకారాలకు ఎదురుచూస్తారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తమ నాయకత్వ ప్రతిభను చూపించి ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగ కుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం లోఉన్న ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.