Telangana DGP | హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఉత్తమ విచారణ విభాగంలో కేంద్ర హోంమంత్రి మెడల్కు ఎంపికైన తెలంగాణకు చెందిన ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ అంజనీ కుమార్ సన్మానించారు. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ మేకల తిరుపతన్న, వరంగల్ టాస్క్ఫోర్స్ ఏసీపీ మూల జితేందర్ రెడ్డి, బోధన్ ఏసీపీ కేఎం కిరణ్కుమార్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ రాజుల సత్యనారాయణ రాజు, డీఎస్పీ భూపతి శ్రీనివాసరావు.. యూనియన్ హోం మినిస్టర్ మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీలో కేంద్ర హోంమంత్రి మెడల్కు ఎంపికయ్యారు.
సోమవారం హైదరాబాద్లోని డీజీపీ అంజనీ కుమార్ తన కార్యాలయంలో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ పోలీస్ అత్యుత్తమ సేవలు అందిస్తున్నదని తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఐదుగురు పోలీస్ అధికారులకు ప్రతిష్టాత్మకమైన పతకాలు రావడం తెలంగాణ పోలీస్ శాఖ కీర్తిని మరింత పెంచాయన్నారు. మిగిలిన పోలీస్ అధికారులు, సిబ్బంది వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీజీపీలు బీ శివధర్రెడ్డి, మహేష్ భగవత్, ఐజీలు ఎం రమేష్, షానవాజ్ ఖాసీం, ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.