హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీఐడీ ఏడీజీ, రాచకొండ మాజీ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ను ప్రతిష్ఠాత్మక ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు-2022 వరించింది. ఢిల్లీలో శుక్రవారం ఆయన పద్మశ్రీ ప్రకాశ్సింగ్, సీఐఎస్ఎఫ్ మాజీ స్పెషల్ డీజీ మంజరి జరుహర్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అరవింద్గుప్తా చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
‘చైల్డ్ సేఫ్టీ’ క్యాటగిరీలో ఆయన ఈ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. 2017-22 మధ్య కాలంలో మహేశ్ భగవత్ రాచకొండ సీపీగా ఉన్నప్పుడు తన బృందంతో కలిసి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న 6,555 మంది పిల్లలను రెస్క్యూ చేయడంతోపాటు వారి చదువు కోసం విశేషంగా కృషి చేశారు. ‘వర్క్ సైట్ స్కూల్’ను ప్రారంభించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు. స్వస్థలాలకు తిరిగి వెళ్లాక కూడా చదువుకునేలా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు ఇప్పించారు.
డీజీపీ అంజనీకుమార్ హర్షం
తెలంగాణ పోలీసులకు ఫిక్కీ అవార్డు రావడంపై డీజీపీ అంజనీకుమార్ హర్షం వ్యక్తంచేశారు. మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. కమిషరేట్ సిబ్బందితో పాటు ఐఏఎస్ రఘునందన్రావుతోపాటు ‘ఎయిడ్ ఎట్ యాక్షన్’ కో-ఆర్డినేటర్ సురేశ్ గుత్తా, ఇటుకబట్టీ యజమానుల సంఘం అధ్యక్షుడు రాజేంద్రరెడ్డి సహకారం మరువలేనిదని చెప్పారు.