భగీరథ విజయంగా నరక చతుర్ధశి
పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్న ఫ్లోరోసిస్ బాధితులు
ఫ్లోరైడ్ రక్కసికి నిప్పంటించి వేడుకలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ విముక్తి కల్పించిన సీఎం కేసీఆర్ని బలపరచాలని పిలుపు
ఫ్లోరోసిస్ బాధితులకు, ఫ్లోరైడ్ సమస్య పరిష్కారంలో మొండిచేయి చూపిన
బీజేపీ సర్కార్ : సుమన్
మునుగోడు ఎన్నికల్లో అభివృద్ధిని బలపరచాలని ఓటర్లకు పిలుపు
ఫ్లోరోసిస్ బాధితులకు స్వీట్లు, పటాకులు కానుకగా పంపిన కేటీఆర్
పున్నమిని ఆస్వాదించలేని అమావాస్య వాళ్ల జీవితం. ఎన్ని ఆశ్వయుజ మాసాలు దాటిపోయాయో. ఏ ఒక్క చతుర్ధశిని వాళ్లు వేడుక చేసుకోలేదు. కాదు.. కాదు చేసుకోలేరు. కాళ్లున్నా కదపలేరు. ఉన్న చోట నుంచి కదలలేరు. మాతాబులు వెలిగించలేరు. వెలిగించిన వాళ్లను చూసి మరింత కుంగిపోయేరు. జీవితాన్ని కమ్మిన చీకట్లను ఎన్నటికీ తరమలేమనే నిరాశలో కూరుకుపోయినోళ్లు వాళ్లు. ఒక్కసారిగా ఆ జీవితాల్లో వెన్నెల విరిసింది. నల్లగొండను పీడించే ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొత్త భవిష్యత్కి బాటలేసిన సందర్భంలో ఉద్యమం ఫలించిన ఆనందం! ఫ్లోరోసిస్కి మరో తరం బలికాకూడదన్న వాళ్ల ఉద్యమ ఆకాంక్ష నెరవేరింది. స్వప్నాలను వెలిగించిన క్షణాన నరక చతుర్ధశి వాళ్లకు తొలి వేడుకయింది. అమావాస్య చీకట్లలో తొలి పున్నమి ఆశ్వయుజ చతుర్ధశి (అమావాస్య)న సంబురపడ్డారు. ‘కాలం కరుణించిందో? దైవం వరమిచ్చిందో? అనే సందేహమే లేదు. ‘కేసీఆర్ పాలించిండు. భగీరథ నీళ్లిచ్చిండ’ని దీవెనల లాంటి పాలనకు జేజేలు పలుకుతూ మునుగోడు ప్రాంత ఫ్లోరోసిస్ బాధితులంతా మర్రిగూడ చేరుకుని ఘనంగా దీపావళి జరుపుకున్నారు. చీకట్లను దహించి.. స్వప్నాలను వెలిగించినట్లుగా వేడుక చేసుకున్నారు!
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మర్రిగూడ మురిసిపోయింది. ఫ్లోరైడ్ భూతానికి, ఫ్లోరోసిస్ వైకల్యానికి చిరునామాగా పేరుపడ్డ ఈ గడ్డ మీద అమావాస్య చీకటి వెన్నెలై మెరిసింది. ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటంలో ముందుండి నిలిచిన ఫ్లోరోసిస్ బాధితులంతా చేరి నరక చతుర్ధశిని భగీరథ విజయంగా జరుపుకున్నారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి మర్రిగూడెంలో జరిగిన ఈ వేడుకల్లో ఫ్లోరోసిస్ బాధితులు, బాధిత కుటుంబాలే కాదు టీఆర్ఎస్ నేతలు, ప్రజలు పాల్గొని ఫ్లోరైడ్ విముక్తి వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్లోరైడ్ రక్కసి దహనం నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫ్లోరైడ్ రక్కసికి నిప్పంటించి ఫ్లోరైడ్ విముక్తి వేడుకను ప్రారంభించారు. అనంతరం ఫ్లోరోసిస్ బాధితులు పటాకులు కాల్చి ఆనందాల్లో మునిగితేలారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఫ్లోరోసిస్ బాధితులకు పంపిన స్వీట్లు, పటాకులు అందజేశారు.
అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికీ నీళ్లిచ్చే భగీరథ పథకం ద్వారా ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమివేశామని అన్నారు. ఈ విజయాన్ని సూచిస్తూ ఫ్లోరోసిస్ భూతాన్ని ఈ రోజు దహనం చేశామని ఇక నుంచి నల్లగొండ ప్రజల జీవితాల్లో ఈ వెలుగులు నిలిచే ఉంటాయన్నారు. మంత్రి కేటీఆర్ పంపించిన చిరు కానుకలు, స్వీట్స్, క్రాకర్స్ని ఫ్లోరోసిస్ బాధితులకు అందజేశారు. ఒకప్పుడు ఫ్లోరైడ్ విముక్తి కోసం ఎన్నో ఏళ్లు పోరాటం చేశామని, ప్రధానమంత్రి వాజ్పేయి టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితులను పెట్టి సమస్యను కండ్లకు కట్టినట్లు చూపినా వాళ్లు కనికరించలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లక్ష్య శుద్ధి, చిత్తశుద్ధి లేని పార్టీలని, ఫ్ల్లోరోసిస్ బాధితుల పక్షనా ఓ పాటగట్టి, పోరాటం నడిపినట్టి కేసీఆర్కి ఈ మునుగోడు, నల్లగొండ జిల్లా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే స్వరాష్ట్రంలో ఇదే ప్రాంతంలో మిషన్ భగీరథకు పైలాన్ వేసి, తెలంగాణకు మంచినీటి సమస్య లేకుండా చేసినట్లు చెప్పారు. కేంద్ర మంత్రులే తెలంగాణలో ఫ్లోరోసిస్ లేదని లోక్సభలో ప్రకటించారని, ఉద్యమ నేత కేసీఆర్ ఈ సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపడం వల్లే ఇది సాధ్యమైనదని సుమన్ గుర్తు చేశారు.
ఫ్లోరైడ్ రక్కసిని మునుగోడు నుంచి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తరిమికొట్టినట్లే నల్లగొండ ప్రజలను ఫ్లోరైడ్ భూతానికి బలిపెట్టిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కూడా తరిమికొట్టాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలవంటి ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. మర్రిగూడలో 300 పడకల దవాఖాన హామీని మరిచి, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ అధ్యయన కేంద్రం రాకుండా అడ్డుపడిన బీజేపీ నల్లగొండ ప్రజల పట్ల ఇప్పటికీ అదే వివక్షను పాటిస్తోందని సుమన్ ఆరోపించారు. మిషన్ భగీరథ పథకానికి రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సూచిస్తే, కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందని, అయినా కేసీఆర్ భగీరథుడిలా మిషన్ భగీరథను పూర్తి చేశారని కొనియాడారు. ప్రభుత్వం చేసిన మేలు మరువకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని, ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఫ్లోరోసిస్ విముక్త పోరాట సమితిని సుమన్ కోరారు. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమిన కేసీఆర్ నాయకత్వాన్ని మునుగోడు ప్రజలు బలపరచాలన్నారు.
ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవరెడ్డి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణస్టేట్ సెంటర్ ఆర్అండ్డీ చైర్మన్ ప్రొఫెసర్ బానోతు రమణనాయక్, టీఆర్ఎస్ నేతలు కర్నాటి విద్యాసాగర్, ఫ్లోరోసిస్ విముక్తి సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాశ్తో పాటు ఫ్లోరోసిస్ బాధితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేటీఆర్ తమకు ప్రేమతో స్వీట్లు, దీపావళి పటాకులు పంపించినందుకు ఫ్లోరోసిస్ బాధితులు అంశల స్వామి, బూడిద సుకన్య, సురిగి రాములు, జంగిటి శివ కృతజ్ఞతలు తెలిపారు.