శ్రీశైలం : శ్రావణమాసం వేడుకలు శ్రీశైలంలో కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీశైలం క్షేత్రం భక్తులతో
కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జామున ఆలయ ద్వారాలు తెరిచి, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారలకు ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజాము నుంచే ఉభయ దేవాలయాల్లో అలంకార దర్శనాలు చేసుకున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ఆర్జిత సేవల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. ప్రధానంగా పారిశుధ్యం, మంచినీటి సరఫరాను నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. ప్రదోషకాలంలో ఆలయ ప్రాకారంలోని పురాతన మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 1,008 దీపాలను వెలిగించి సహస్ర దీప నివేదన చేశారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించారు.