హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): శ్రీశైలంలో కొలువుదీరిన భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఆలయ ఈవో లవన్న సూచించారు. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తామని వెల్లడించారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత దర్శనాలను రోజుకు రెండుసార్లు కల్పిస్తున్నామని తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు .. తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు సాధారణ భక్తులు ఉచితంగా స్పర్శ దర్శనం చేసుకొనేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఈవో తెలిపారు.