చేర్యాల, జనవరి 21 : సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) ఆదివారం భక్తుల(Devotees)తో పోటెత్తింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. పట్నం వారం సందర్బంగా హైదరాబాద్ నగరానికి చెందిన 75వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, నేటి ఆదివారంతో మొదలై 8 ఆదివారాలపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. ఇందుకోసం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.