యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దసరా పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రీశుడి సన్నిధికి చేరుకున్నారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, తిరుమాఢవీదుల్లో భక్తుల రద్దీ కనిపించింది. స్వామివారి వీఐపీ దర్శనానికి గంట, ధర్మదర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారిని 13,978 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
కొండపైన పార్కింగ్లు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణిలో భక్తుల సందడి నెలకొన్నది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులు, పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు. కొండ కింద దీక్షాపరుల మండపం వద్ద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వామివారికి నిత్యపూజలు తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి మొదలయ్యాయి. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. స్వామివారి ఆర్జిత పూజలయిన సువర్ణ పుష్పార్చన, నిత్య తిరుకల్యాణోత్సవం, దర్భార్సేవ, తిరువీధి సేవలు అత్యంత వైభవంగా సాగాయి. మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి, సినీ దర్శకుడు అల్లాణి శ్రీధర్ దర్శించుకున్నారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.29,61,251 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.