శ్రీశైలం : మహా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లన్ని భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి ఉచిత దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పాతాళగంగలో నీటిమట్టం తగ్గడంతో జల్లు స్నానానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
సాయంత్రం 5:30 గంటలకు స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి 10 గంటల నుంచి విశేష పూజలు నిర్వహించనున్నారు. స్వామి వారికి లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఆలయ విమాన గోపురానికి పాగాలంకరణ చేయనున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు.