రాజన్న సిరిసిల్ల : వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుండే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తమ ప్రీతి మొక్కైన కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 3 గంటల పాటు క్యూలైన్లలో నిల్చున్నారు.
రాజన్న ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కోడె మొక్కులు, కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, చండీ హోమం, గండదీపం మొక్కులు నిర్వహించారు. రాజన్న అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ, నగరేశ్వర ఆలయాల వద్ద భక్తులు క్యూ లైన్లలో నిలబడి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజన్నను దాదాపు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.