కలెక్టరేట్, సెప్టెంబర్ 20 : అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లాలోని నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలు, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగారం, దమ్మాయిగూడలో హెచ్ఎండీఏ నిధులతో చేపట్టిన పైప్లైన్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాగారం మున్సిపాలిటీలో రూ. 8 కోట్లతో చేపట్టనున్న నాల పైప్లైన్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసి మొదలు పెడుతామని చెప్పారు.
వర్షా కాలంలో మంపు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుకుండా ప్రభుత్వం కోట్ల రూపాయిలు కేటాయించిందని, ఈ నిధులతో వచ్చే వర్షా కాలంలో లోపు పైప్లైన్ పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆధికారులను మంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీలలో ఎలాంటి సమస్యలు లేకుండా అంతర్గత మురికి కాలువలు, సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు పూర్తి చేయాలని అన్నారు.
కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ కావ్య, నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత, కమిషనర్లు వాణిరెడ్డి, స్వామి, హెచ్ఎండీఎ అధికారులు వెంకటరమణ, పద్మ, వెంకన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు.