Bhupalpally | శాయంపేట నియోజకవర్గంలో ఉన్న భూపాలపల్లి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వెంకట రమణారెడ్డి, 2014లో టీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, 2018లో కాంగ్రెస్ నుంచి వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. విద్య, వైద్యం, రవాణా వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. నాటి కుగ్రామం నేడు మున్సిపాలిటీగా మారింది. అధునాతన ఇంటిగ్రేటెడ్ మారెట్, వంద పడకల దవాఖాన, డయాగ్నొస్టిక్ హబ్, దివ్యాంగుల సంక్షేమ భవనాలు ఏర్పాటయ్యాయి. మెడికల్ కళాశాల, 300 పడకలతో మరో దవాఖాన, ఆయుష్ వైద్యశాల, సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయ సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి.
నియోజకవర్గంలో ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేసింది. దేవాదుల ఎత్తిపోతల్లో భాగంగా రూ.1,348.96 కోట్లతో భూపాలపల్లి మండలం.. భీం ఘన్పూర్లో 3వ పంపుహౌస్ నిర్మాణంతో పాటు భీం ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి రామప్ప చెరువు వరకు 25.3 కిలోమీటర్ల మేర మూడు పైపులైన్లు నిర్మించింది. మూడో పంపుహౌస్లో 22 మెగావాట్ల సామర్థ్యం గల మూడు విద్యుత్ మోటర్లను అమర్చింది.
నియోజకవర్గంలో మొత్తం 618 చెరువులు ఉండగా 55,301 ఎకరాలు సాగవుతున్నది. ఎస్సారెస్పీ డీబీఎం 38 కింద రేగొండ, చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, గణపురం మండలాల్లోని చెరువులకు సాగునీరు అందుతున్నది. రామప్ప సరస్సు నుంచి గణప సముద్రం రిజర్వాయర్లో గోదావరి జలాలను నింపడానికి రూ.15.17 కోట్లతో 2.81 కిలోమీటర్ల ఫీడర్ చానెల్ను నిర్మించారు.
చెల్పూర్ కేటీపీపీ రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఆరు నూతన సబ్ స్టేషన్లను నిర్మించింది. చిట్యాల, రేగొండ, జంగేడుల్లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రాలను నెలకొల్పింది.
పట్టణంలో రూ.29.46 కోట్లతో 100 పడకల దవాఖానను ప్రభుత్వం నిర్మించింది. రూ.11 లక్షలతో పాలియేటివ్ సేవా కేంద్ర (పీఆర్) భవనం, రూ.16.60 లక్షలతో ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటరీ, రూ.54 లక్షలతో 20 పడకల పిల్లల సంరక్షణ విభా గం, రూ.కోటీ 25 లక్షలతో డయాగ్నొస్టిక్ హబ్ను ఏర్పాటు చేసింది. గ్రామీణ విద్యార్థుల కోసం మెడికల్ కళాశాలను మంజూరు చేసింది.
రూ.68.25 కోట్లతో జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు అధికారుల కోసం 10 క్వార్టర్ల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.86 కోట్లతో మూడంతస్తుల జిల్లా పోలీస్ కార్యాలయ సముదాయం, ఎస్పీ క్యాంపు, ఏఆర్ హెడ్క్వార్టర్ భవనాలు, మెన్ బ్యారక్ పనులు కొనసాగుతున్నాయి.
రూ.22 లక్షల చొప్పున 29 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. భూపాలపల్లిలో రూ.3 కోట్లతో బీసీ బాలుర వసతి భవనం, రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మారెట్, రూ.3 కోట్లతో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ భవనాన్ని నిర్మించింది.
…?గోపాల్ పిన్నింటి