యాదాద్రి : తిరుపతితో సమానంగా యాదాద్రి ఆలయం అభివృద్ధి జరిగిందని, ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా సతీమణి ఉషా దయాకర్తో కలసి ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభాలు జరగాలని, సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వములో తెలంగాణ ప్రజలకు ఎనిమిదేండ్ల నుంచి శుభం జరుగుతుందని అన్నారు.
కేంద్రం సహకరించకపోయినా భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు పోతుందని తెలిపారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని సీఎం బాగా అభివృద్ధి చేశారని కొనియాడారు.