సిద్దిపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న, కొండ పోచమ్మ అమ్మవారిని ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొమురవెల్లి ఆలయం వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొమురవెల్లికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
అన్ని రహదారుల అభివృద్ధి, వసతి కోసం కాటేజెస్, తాగునీటి సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. కొండ పోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు.
యాదాద్రి నిర్మాణం అద్భుత కళాఖండం. అలాగే భద్రాచలం, వేములవాడ దేవాలయాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నాని పేర్కొన్నారు.