రాజన్న సిరిసిల్ల : స్వరాష్ట్ర స్వపరిపాలనలో భాగంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాంస్కృతిక, పురాతన, చారిత్రాత్మక నిర్మాణాల్లో భాగంగా పలు ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. సోమవారం వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి, కొండగట్టు అంజన్నను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల వినోద్కుమార్ మాట్లాడారు.
రాష్ట్రం సిద్ధించిన తర్వాత కృష్ణా, గోదావరి నదులపై అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టుల నిర్మించారని కొనియాడారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో తెలంగాణ ఇవ్వాళ మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసే దశకు చేరిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 70ఏండ్లలో ఆలయాలు, సాంస్కృతిక, చారిత్రాత్మక కట్టడాల అభివృద్ధిని సీమాంధ్ర పాలకులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రాష్ట్రం వచ్చాకనే యాదాద్రి నరసింహ ఆలయాన్ని పునర్నిర్మించుకున్నామన్నారు.
దక్షిణ కాశీగా భావించే వేములవాడ రాజన్న క్షేత్రంతోపాటు కొండంత అండను అందించే కొండగట్టు అంజన్న ఆలయాల అభివృద్ధికి ఇప్పటికే పలు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాను ఎంపీగా కొనసాగుతున్న సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రసాద్’లో తెలంగాణ ఆలయాల అభివృద్ధి చేపట్టాలని వినతులు అందజేసినట్లు గుర్తు చేశారు.
ఇపుడు మరోసారి ప్రణాళికా సంఘం తరపున కృషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ముత్యంపేట-కొండగట్టు సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మల్యాల, కొడిమ్యాల జడ్పీటీసీలు కొండపలుకుల రాంమోహన్రావు, పునుగోటి ప్రశాంతి, మల్యాల, కొడిమ్యాల ఎంపీపీలు మిట్టపల్లి విమల, మేన్నేని స్వర్ణలత, మల్యాల పాల్గొన్నారు.