పెద్దపల్లి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికచింతనకు, దేవాలయాల అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతతకు ఇది మరో నిదర్శనం. మారుమూల ప్రాంతం పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం 20 గ్రామాల ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు రూపం. 30 ఏండ్ల క్రితం ఒక పుట్టలో స్వయంభువుగా సాక్షాత్కరించిన ఒక శివలింగం.. అప్పటినుంచి రావి, వేప చెట్టు నీడలో నాగలింగేశ్వరస్వామిగా నీరాజనాలు అందుకుంటున్నది. ఇక్కడ గుడి కట్టేందుకు ఇద్దరు దళిత సోదరులు 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చినప్పటికీ, చొరవ చూపే నాయకుడు లేక ఇంతకాలమూ అది కలగానే మిగిలిపోయింది. చివరకు తన పూర్వీకుల గ్రామమైన రాగినేడు గ్రామంలో ఆలయం నిర్మించాలన్న సంకల్పం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్కు కలగడం, ఆయన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో మూడు దశాబ్దాల కల సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్ అప్పటికప్పుడే రూ.50 లక్షల నిధులు మంజూరు చేయడంతో పాటు పలువురు దాతలు, భక్తులు ఉడతాభక్తిగా నిధులు సేకరించడంతో ఆలయ నిర్మాణం వాస్తవరూపం దాల్చింది.