చిక్కడపల్లి, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. తెలంగాణ నేటివిటీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర (టీఎన్ఈడబ్ల్యూఎస్ఏ), నాన్లోకల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్ఎల్టీఏ) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్ర, తెలంగాణ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కేసీఆర్ పాలనలో గడిచిన ఎనిమిదేండ్లలో తెలంగాణలో అద్భుతాలు జరిగాయని అన్నారు. వలసలు ఆగాయని, బీడు భూములు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని చెప్పారు. ఒకే సమయంలో విడిపోయినా.. ఏపీతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని స్పష్టంచేశారు. ఏపీ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నదని, కనీసం ఉద్యోగుల జీతాలు సరైన సమయంలో ఇవ్వడంలేదని విమర్శించారు. ఇక సామాన్య ప్రజల కష్టాలు చెప్పనక్కర్లేదని అన్నారు.
తెలంగాణలో కొత్త పరిశ్రమలు రాకతో నిరుద్యోగ సమస్య తీరిందని, ఏపీలో నిరుద్యోగం పెరిగి వలసలు పెరిగాయని చెప్పారు. మూడున్నర ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందిస్తుంటే.. ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ నేటికీ పూర్తి కాలేదని పేర్కొన్నారు. టీఎన్ఈడబ్ల్యూఎస్ఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు రావుల కిశోర్బాబు, రమేశ్నాయుడు, ప్రధాన కార్యదర్శి బీ అంజయ్య, ఎన్ఎల్టీఏ మోహన్రావు, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, డాక్టర్ శ్రీనివాస్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.