స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 25 : మత కలహాలు సృష్టిస్తున్న బీజేపీని లేకుండా చేస్తేనే రాష్ట్రం బాగు పడుతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న అధ్యక్షతన రూ. 41 లక్షల విలువైన 114 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు, నియోజకవర్గంలో రూ. 3 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్స్ అందించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
2014కు ముందు వచ్చేపోయే కరెంటుతో, కరువుకాటకాలతో తెలంగాణ ప్రజలు వలస వెళ్లేవారని, వేసవి కాలంలో తాగునీటి కోసం గ్రామాల్లో ధర్నా చేయని రోజులు ఉండేవి కావన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 24 గంటల నాణ్యమైన కరెంటు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి ఫిల్టర్ చేసిన తాగునీరును అందిస్తున్న దేశంలోని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.
ఈవిషయంలో కేంద్రమంత్రులే స్వయంగా తెలంగాణను అభినందించారని పేర్కొన్నారు. తెలంగాణలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవడం తప్ప బీజేపి రాష్ర్టానినకి చేసింది ఏమిలేదనీ, దీన్ని ప్రజలందరు గుర్తించాలని కడియం శ్రీహరి అన్నారు.
బండి సంజయ్కి తెలంగాణపై ప్రేమ ఉంటే విభజన హామీలైన కాజీపేట రైల్వే కోచ్, ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన యునివర్సిటీ, తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వాలని నరేంద్రమోదీని డిమాండ్ చేయాలన్నారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెళ్ళి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి, జనగామ జిల్లా రైతుబంధుసమితి సభ్యులు రాంబాబు, చిల్పూర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి, ఎంపీటీసీ బూర్ల లతాశంకర్, జఫర్గఢ్ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, పాల్గొన్నారు.