కరీంనగర్ : బీఆర్ఎస్ పార్టీనే మా భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములు ఇప్పుడు కాళేశ్వరం నీటితో కలకలాడుతున్నాయి. కరువు నుంచి అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రా వాళ్లు కాంగ్రెస్, బీజేపీ ముసుగుతో వచ్చి తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారు.
తెలంగాణ యువత భవిష్యత్తను కాపాడేది కేసీఆర్ మాత్రమే అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రా ముసుగులో లీడర్లు వస్తున్నారు, నమ్మవద్దు. యువత భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
ఈటెల రాజేందర్ భయపడే హుజురాబాద్ లోనూ పొటీ చేస్తాను అంటున్నారు. బండి సంజయ్ గంజాయి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గంజాయిని ఎవరైనా ప్రోత్సహిస్తారా? కరీంనగర్ గంజాయి రహితంగా ఉండాలని సీపీకి ఇంతకు ముందే చెప్పామని గుర్తు చేశారు. సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయి.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో విఫలం అయిందని విమర్శించారు. కర్ణాటకలో పథకాలు అమలు చెయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు ఎలా చేస్తారని కాంగ్రెస్ను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. ఈటెల సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించారు.