వర్ధన్నపేట, ఆగస్టు 3 : గిరిజన బాలికల సంక్షేమ గురుకులానికి చెందిన 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఫిరంగిగడ్డలోని వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులు ఆదివారం రాత్రి చికెన్తో భోజనం చేశారు. సోమవారం ఉదయం టిఫిన్ చేసిన విద్యార్థినులు వాంతులు చేసుకోవడంతో పాటుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నట్టు హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థినులను పట్టణంలోని ఏరియా దవాఖానకు తరలించారు. సూపరింటెండెంట్ డాక్టర్ విరీన్ ఆధ్వర్యంలో వైద్యులు బాలికలకు వైద్య పరీక్షలు చేశారు.
ఆదివారం రాత్రి తిన్న చికెన్, ఉదయం తిన్న టిఫన్ కలుషితం కావడంతో ఫుడ్పాయిజన్ జరిగి బాలికలు అస్థతతకు గురై ఉంటారని వైద్యులు చెబుతున్నారు. బాలికల తల్లిదండ్రులు దవాఖానకు చేరుకొని ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జడ్పీ సీఈవో రాంరెడ్డి, డీటీడీవో నారాయణరెడ్డి, తహసీల్దార్ విజయ్సాగర్ దవాఖానకు వెళ్లి బాలికల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు. అధికారులు వసతిగృహం వద్దకు వెళ్లి కిచెన్షెడ్, డార్మెటరీ, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు.