నర్సాపూర్, నవంబర్ 4: బీఆర్ఎస్ హయాంలోనే ముస్లింల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతున్నదని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి తెచ్చిన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో ముందు ఉంచుతున్నారని తెలిపారు. కేసీఆర్కు ముస్లింలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో హిందూ, ముస్ల్లింల మధ్య తరుచూ గొడవలు జరిగేవని, నేడు అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలసి ఉంటున్నారని పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ, వినాయక నిమజ్జనం ఒకేరోజు వస్తే ముస్లిం పెద్దలు ఆలోచించి తమ పండుగను వాయిదా వేసుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో మత సామరస్యం వెల్లివిరుస్తున్నదని, రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలకు ఇదే నిదర్శనమని వెల్లడించారు.
షాదీముబారక్తోపాటు ముస్ల్లిం విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్స్, ముస్ల్లిం పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోడానికి రూ.20 లక్షల సాయం, ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఇలా ముస్లిం మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి అని దుయ్యబట్టారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, పార్టీ మైనార్టీ సెల్ సెక్రటరీ బాసిత్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, వైస్ ఎంపీసీ వెంకటనర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.