చండూరు : రాష్ట్రంలో సమర్ధవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వం వల్ల అభివృద్ధి చురుకుగా జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సన్నాహాల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీ లోని రాజశ్రీ గార్డెన్ లో మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల ఇన్చార్జీలు, యువ నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ పథకాలను, సీఎం కేసీఆర్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను ఓటర్లకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలను మోసం చేయడానికి బీజేపీ నెరవేరని హామీలు ఇస్తుందని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ వల్ల నిత్యావసర ధరలు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా అభివృద్ధి జరిగితే మునుగోడులో రాజగోపాల్రెడ్డి వల్ల అభివృద్ధి జరగలేదని వివరించాలని సూచించారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు. సారు, కారు, సర్కారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చండూరు లోని బంగారు గడ్డ, సారంపేట గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా చోట్ల జరుగుతున్న ప్రచార సరళిని ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి లను అడిగి తెలుసుకున్నారు.