మహబూబ్నగర్, జూన్ 23 : అందరం కలిసి ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని వడ్డెర బస్తీలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ సంఘం భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.
అనంతరం బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మికులు 200 మంది టీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ, కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న 500 మంది ఆటో యూనియన్ నాయకులు మంత్రి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వలస కడుతున్నారని తెలిపారు. పాలమూరును హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేసి తీరుతామన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ను ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ సభ్యులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, కౌన్సిలర్లు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.