ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెల్లడి
బీజేపీ, కాంగ్రెస్ నుంచి 600 మంది టీఆర్ఎస్లో చేరిక
మంచిర్యాల, మందమర్రి, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో అభివృద్ధి ఉద్యమంలా కొనసాగుతున్నదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని అభివృద్ధి సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్నదని కొనియాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చూసి పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి సుమారు 600 మంది విప్ సుమన్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం బాల్క సుమన్, ఓదెలు మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే ఏ ఒక్క బీజేపీ నాయకుడిని ఈ ప్రాంతంలో తిరగనివ్వం, ఖబడ్దార్ నాయకుల్లారా అంటూ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని బొందపెడితేనే వారి దుర్మార్గపు చర్యలు బందవుతాయని పేర్కొన్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఏరియాను బొందలగడ్డ కానివ్వనని విప్ సుమన్ స్పష్టం చేశారు.