జగిత్యాల, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తున్నారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి శనివారం ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప దార్శనికుడు అంబేద్కర్ అని చెప్పారు. అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. దళితబంధును అమలుచేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కిందని స్పష్టంచేశారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ర్టానికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.