హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధిస్తున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్తు మొదలు అన్నిరంగాల్లో ఊహించని వృద్ధి కనిపిస్తున్నదని, అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. నూతనంగా ఎంపికైన జూనియర్ అసిస్టెంట్లకు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో (ఎంసీహెచ్చార్డీ) నెలరోజుల శిక్షణను వినోద్కుమార్తోపాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు కరెంటు కోతలతో అల్లాడేవారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇండ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్తు ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా ఎదిగామన్నారు. భారీస్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టి నదీజలాలను తెలంగాణ పల్లెలకు మళ్లిస్తున్నారని, విద్యారంగంలో గురుకులాలతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అనేక పథకాలను అమలు చేయడం ద్వారా సామాజికంగా గుణాత్మక మార్పులు సాధించగలిగామని వెల్లడించారు. రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల ఖాతాలకు నేరుగా డబ్బు పంపడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయని, చెప్పారు. ఫలితంగా కరోనా విపత్తు సమయంలోనూ దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు నిజాయితీగా, కష్టపడి పనిచేసి పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఎంసీహెచ్చార్డీ డీజీ హర్ప్రీత్ సింగ్ ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.