కార్పొరేషన్, జూన్ 6: ప్రపంచస్థాయి అద్భుతమైన డిజైన్లతో మానేరు రివర్ఫ్రంట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనులను, ఫార్మసీ కళాశాల సమీపంలో స్టేడియం నిర్మాణ స్థలాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి మంత్రి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు కన్నా అద్భుతంగా ఉం డేలా మానేరు నదిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎల్ఎండీ డ్యాం కట్ట నుంచి 3.7 కిలోమీటర్ల మేరకు రూ.410 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్లో 12 ఫీట్ల మేరకు నీరు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.35 కోట్ల వ్యయంతో అద్భుతమైన ఫౌంటెయిన్ నిర్మాణాన్ని చేపడుతున్నామని అన్నారు. రూ.12 కోట్ల వ్యయంతో దుబాయ్ నుంచి బోట్స్ తీసుకొస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టు పనులను ఏడాదిన్నరలోపే పూర్తి చేస్తామని తెలిపారు.
సీఎం ఆకాంక్షల మేరకు అభివృద్ధి : వినోద్కుమార్
2014లో కేసీఆర్ సీఎంగా అధికారం చేపట్టాక మొదటిసారి కరీంనగర్కు వచ్చినప్పుడు ఈ నగరాన్ని లండన్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పారని, వారి ఆలోచన మేరకు మానేర్ రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి తదితర ప్రాజెక్టులను చేపడుతున్నామని వినోద్కుమార్ తెలిపారు. పద్మనగర్లో టీటీడీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.