హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గడ్డపై బాలికల విద్యకు పునాదులేసిన విద్యాలయాల్లో ఒకటి ఆ పాఠశాల.. నిజాం రాజులు సుందరంగా నిర్మించిన భవనంలో వైభవోపేతంగా, వందలమంది బాలికలతో సందడిగా కళకళలాడేది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకుల ఆదరణ కరువై పెచ్చులూడిన గోడలతో, పిచ్చి మొక్కలు మొలిచిన పరిసరాలతో కళా విహీనమైంది. స్వరాష్ట్రంలో మళ్లీ ఆ విద్యాలయానికి గత వైభవం వచ్చింది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.. అదే హైదరాబాద్లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాల. నిన్నమొన్నటివరకు రోజూ చూసినవాళ్లు కూడా ఇప్పుడు ఈ పాఠశాలను గుర్తుపట్టలేకపోతున్నారు. కార్పొరేట్ హంగులతో మెరిసిపోతున్న స్కూలును చూసి ఔరా అంటున్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో గన్ఫౌండ్రీలోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలతోపాటు అలియా ఉన్నత పాఠశాల, రంగారెడ్డి జిల్లాలో జడ్పీహెచ్ఎస్ శివరాంపల్లి, జడ్పీహెచ్ఎస్ జిల్లెలగూడను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికచేసి సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. మహబూబియా పాఠశాలలో రూ. 84.5 లక్షలు వెచ్చించి కార్పొరేట్ లుక్ తీసుకొచ్చారు.
పాఠశాలలో చేపట్టిన పనులు
18 తరగతి గదుల్లో పాతవాటి స్థానంలో కొత్త విద్యుత్తు పరికరాలు అమర్చారు. ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు ఎల్ఈడీ బల్బులు పెట్టారు.
భవనం మొత్తం అల్టిమా పెయింట్ వేశారు. తరగతి గదుల లోపల వెదర్, వాటర్ ప్రూఫ్ రంగులు, పిక్టోరియల్ పెయింటింగ్స్ పూర్తి చేశారు.
పై కప్పు (రూఫ్) లీకేజీ కాకుండా ట్రీట్మెంట్ చేశారు.
నాలుగు టాయ్లెట్స్ బ్లాక్స్లో అధునాతన టైల్స్తో కొత్త టాయిలెట్లను నిర్మించారు.
కిటికీలు పాడైపోకుండా పాలి కార్పొనేట్ షీట్ అమర్చారు.
పాఠశాలలో పాత్వే (నడకదారి) నిర్మించారు.
పాఠశాల ముందు స్వాగత తోరణం, గేటు అమర్చారు.
ప్రాంగణం మొత్తం ప్రహరీగోడ నిర్మించి, చిత్రాలతో అలంకరించారు.
112 డ్యూయల్ డెస్క్ బల్లలు, టీచర్ల కోసం 12 టేబుళ్లు, ప్రధానోపాధ్యాయుడి కోసం ఒక టేబుల్ సమకూరుస్తున్నారు.
హ్యాండ్వాష్, తాగునీటి కోసం 10వేల లీటర్ల సంప్, మోటర్ కనెక్షన్ ఇచ్చారు.
మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఇటీవలే ఈ స్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజనం చేసేందుకు డైనింగ్హాల్, ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు సీసీ రోడ్డు, 200 మంది సామర్థ్యంగల ఆడిటోరియం, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు.
మన ఊరు -మన బడి చరిత్రలో నిలిచిపోతుంది
ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు మన బడి- మన బస్తీ మన బడి’ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది. రాష్ట్రంలోని పాఠశాలలన్నీ నూతన హంగులు సంతరించుకొంటాయి. రూ.7,289 కోట్లతో మూడు దశల్లో చేపడుతున్న ఈ కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్ట్గా రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడ, హైదరాబాద్లోని అలియా, మహబూబియా పాఠశాలలను ఎంపికచేశాం. ఆ స్కూళ్లలో రూ.3 కోట్లకు పైగా నిధులను వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీలు, ఇతర మరమ్మతులు, పెయింటింగ్ లాంటి పనులు దాదాపు పూర్తికావచ్చాయి. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదు. పాఠశాలలను సందర్శిస్తే అప్పటికి, ఇప్పటికి తేడా తెలుస్తుంది. – సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి.
మహబూబియాకు వెచ్చించిన మొత్తం
పాఠశాల నిధులు: (రూ.లక్షల్లో)
ప్రాథమిక పాఠశాల : 22.59
ఉన్నత పాఠశాల :61.60
మొత్తం :84. 19