సంస్థాన్ నారాయణపురం : దాదాపు 12 సంవత్సరాల తర్వాత నాంపల్లి మండల కేంద్రం నుంచి యాదగిరిగుట్టకు బస్సు సర్వీసు పునః ప్రారంభమైంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం, భువనగిరికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సదుపాయం లేక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా బస్సు సదుపాయం కల్పించడంతో మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి, గట్టుప్పుల్, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపురం చండూరు, చౌటుప్పల్ ప్రయాణీకుల ఇక్కట్లు తీరనున్నాయి.
1985లో దేవరకొండ డిపో నుంచి నాంపల్లి, మర్రిగూడ, సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్, భువనగిరి మీదుగా యాదగిరిగుట్ట వరకు 2010 వరకు బస్సులు నడిచాయి. ఆ తర్వాత బస్సు సర్వీస్ను నిలిపివేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత సర్వీసును పునః ప్రారంభించడంతో ఆయా మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు బస్ సంస్థాన్ నారాయణపురానికి ఉదయం 11.30 గంటలకు చేరుకొని యాదగిరిగుట్ట వైపు, సాయంత్రం 6 గంటలకు సంస్థాన్ నారాయణపురం చేరుకొని నాంపల్లికి వెళ్తుంది.