Revanth Reddy | ఓ చేతిలో దుడ్డుకర్రను పట్టుకుని ఆగ్రహంగా కనిపిస్తున్న ఈమె నక్క దేవమ్మ. మహబూబ్నగర్ జిల్లా ఓబులాయిపల్లికి చెందిన రైతు. కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తుంటే.. రెండెకరాల పొలంలో మూడు పంటలు సాగు చేసుకుంటున్నానని గర్వంగా చెప్పుకుంటారామె. అలాంటిది రేవంత్రెడ్డి సాగుకు 3 గంటలే చాలనటంతో ఎక్కడలేని కోపంతో ఊగిపోయారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలపై రైతు వేదికల వద్ద నిరసన చేపడుతున్నారని తెలుసుకున్న ఆమె.. స్వయంగా వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. రేవంత్పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ‘కరెంటు జోలికొస్తే కట్టె ఇరుగుతది బిడ్డా!’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
మహబూబ్నగర్, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మూడు గంటల కరెంట్ మాకొద్దు..’ అంటున్నది దేవమ్మ. మహబూబ్నగర్లో రైతువేదిక వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న ఆమె.. మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో ఆవేశంగా మాట్లాడారు. ‘మూడు గంటల కరెంటు అన్నోన్ని కట్టెతో కొడ్తా..ఈ సారి కూడా వాళ్లు(కాంగ్రెస్) రారు (అధికారంలోకి). మీరే వస్తరు. మీ వెంటే మేం ఉంటం’ అని స్పష్టం చేశారు.
మంత్రి : ఏం పేరమ్మ నీది?
మహిళా రైతు : దేవమ్మ
మంత్రి : ఎన్ని ఎకరాలుంది?
దేవమ్మ: రెండెకరాలు ఉంది సార్
మంత్రి : నాటేస్తున్నవా?
దేవమ్మ: ఏస్తున్న
మంత్రి : ఏమిచేస్తున్నవ్ ఇప్పుడు ?
దేవమ్మ: వడ్లు చేస్తున్న
మంత్రి : కరిగెట కొట్టిపిచ్చినవా?
దేవమ్మ: ఇప్పుడు తుకం చేయనీకేపోతున్న
మంత్రి : ఇప్పుడు కరెంట్ అంట కాంగ్రెసోళ్లు 3 గంటలు ఇస్తామంటున్నరు. సరిపోతదా?
దేవమ్మ: సరిపోదు. మేం ఎట్ల బతుకుదుము?
మంత్రి : మూడు గంటలు సరిపోతది. వేస్ట్ అయితదంట?
దేవమ్మ: మాకు సాలదు.
మంత్రి : కాంగ్రెసేయాన మేం 3 గంటలే ఇచ్చినం అప్పుడు. ఇప్పుడు కూడ 3 గంటలే ఇస్తాం అంటున్నరు?
దేవమ్మ: మాకు సాలది.. సాలది. (అని బిగ్గరగా అరుస్తూ చెప్పారు)
మంత్రి :మరి 3 గంటలన్నోన్ని ఏంజేద్దం?
దేవమ్మ:మీరే రావాలి. మేం మీకే ఏస్తాం. గాని వాళ్లని వల్లం. మేం వల్లమంటే వల్లం
మంత్రి : 3 గంటలు కరెంట్ అన్నోన్ని ఏం జేద్దం చెప్పు?
దేవమ్మ: ఈ కట్టెవట్టి కొడతా (అంటూ కర్ర పైకెత్తారు) అందరి ముందు కట్టె పైకెత్తడంతో సభలో ఉన్నోళ్లంతా ఆమెను మెచ్చుకున్నారు.
3 గంటలా? 3 పంటలా?
24 గంటల ఉచిత విద్యుత్తు వద్దన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్పై తెలంగాణ రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు. 3 గంటల కరెంటు చాలన్న వ్యాఖ్యలపై వారు తీవ్రంగా మండిపడ్డారు. ‘మూడు గంటల కాంగ్రెస్ వద్దు.. మూడు పంటల బీఆర్ఎస్సే కావాలి’ అంటూ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు.. పాలమూరు నుంచి నల్లగొండ వరకు.. రైతులు ముక్తకంఠంతో నినదించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికల్లో బీఆర్ఎస్ నిర్వహించిన సదస్సులకు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. కొన్నిచోట్ల ట్రాక్టర్లతో నిరసన ర్యాలీలు చేపట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి దిష్టిబొమ్మలను దహనం చేశారు. రేవంత్ వెంటనే క్షమాపణలను చెప్పాలంటూ రైతుసదస్సుల్లో తీర్మానం చేశారు.