హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మలాజిగిరి జిల్లా నిజాంపేట మండలం బాచుపల్లి పరిధిలోని ఏపీఆర్ ప్రణవ్ యాంటిల్లా గేటెడ్ కమ్యూనిటీ వద్ద రహదారి నిర్మాణం వెనుక ఎవరున్నారో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైకోర్టు బాచుపల్లి, దుండిగల్, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వోలను ఆదేశించింది. ఏపీఆర్ ప్రణవ్ యాంటిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టడంతో.. తమ గేటెడ్ కమ్యూనిటీలోని కాంపౌండ్ వాల్ను ఈ నెల 9న హైడ్రా అధికారులు కలిసి కూల్చివేసి, రహదారి నిర్మాణం చేపట్టారని పిటిషనర్లు ఆరోపించారు. అనంతరం హైడ్రా తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. ఆ రోడ్డు తాము వేయలేదని చెప్పారు. దీంతో ఆ రోడ్డు ఎలా ఏర్పడిందో దర్యాప్తు జరిపి, నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్.. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. అప్పటివరకు అక్కడ యథాతథ స్థితి కొనసాగించాలని, కొత్తగా ఏర్పడిన రహదారిపై రాకపోకలకు అనుమతించవద్దని స్పష్టం చేశారు.
మిషన్ భగీరథ’ బకాయిల్లో సగం చెల్లించండి : హైకోర్టు
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పనులకు సంబంధించి ఎన్సీసీ లిమిటెడ్కు చెల్లించాల్సిన బకాయిల్లో కనీసం 50% మొత్తాన్ని ఈ నెల 26లోగా చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ఆర్థిక శాఖను ఆదేశించింది. ఆ గడువులోపు చెల్లింపులు జరగకపోతే ఈ నెల 30న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాను హెచ్చరించింది. మిషన్ భగీరథ పథకం కింద పలు నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన నిర్మాణాలు, నిర్వహణ పనులకు సంబంధించి రూ.180.17 కోట్ల బిల్లులు చెల్లించలేదని ఎన్సీసీ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేయడంతో.. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను 2 నెలల్లో చెల్లించాలని నిరుడు ఆగస్టులో హైకోర్టు ఆదేశించించింది. అయినప్పటికీ ఆ ఆదేశాలు అమలు కాకపోవడంతో ఎన్సీసీ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్పై జస్టిస్ టీ మాధవీదేవి విచారణ జరిపారు. బకాయిల్లో కనీసం సగం మొత్తాన్ని ఈ నెల 26లోగా చెల్లించాలని, లేకుంటే ఈ నెల 30న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
మెడికల్ సీట్ల భర్తీ గడువు పెంపుపై వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మెడికల్ పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గడువును పెంచే అంశంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కమిషన్ను ఆదేశించింది. పీజీ అడ్మిషన్ల గడువు ఫిబ్రవరి 28తో ముగిసినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వందల సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ పిటిషన్ వేసింది. కన్వీనర్ కోటాలో 124, మేనేజ్మెంట్ కోటాలో 252 కలిపి మొత్తం 377 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ.. ఈ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై స్పష్టత అవసరమని పేరొంటూ.. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.