హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): సాధారణంగా ఫీజులు పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్రైవేట్ కాలేజీలు సంబురపడతాయి. లాభాలు జుర్రుకోవచ్చని సంతోషిస్తాయి. కానీ, కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు ఇందుకు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం. ‘మా కాలేజీ ఫీజులు పెంచకండి. పాత ఫీజులనే ఖరారు చేయండ’ని తెలంగాణ ఫీజు అడ్మిషన్ అండ్ రెగ్యులరేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలో మూడేండ్లకోసారి ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను సవరిస్తున్నారు. చివరిసారిగా 2019-2020 విద్యా సంవత్సరంలో ఫీజులను ఖరారు చేయగా, వాటి గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో 2022-23, 2023-24, 2024-25 బ్లాక్పీరియడ్కు ఫీజులను సవరించేందుకు టీఏఎఫ్ఆర్సీ కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాలను సేకరిస్తున్నది. రాష్ట్రంలోని 175 ఇంజినీరింగ్ కాలేజీలు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించాయి. ఆయా ప్రతిపాదనలను ఆడిటర్ల చేత అధికారులు పరిశీలన చేయించారు. ఈ నెల 16 నుంచి టీఏఎఫ్ఆర్సీ కార్యాలయానికి యాజమాన్యాలను పిలిచి చర్చిస్తున్నారు. ఇప్పటివరకు 15 కాలేజీలను విచారించగా, కొన్ని కాలేజీలు ఫీజులు పెంచవద్దని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. విద్యార్థులు చేరక, సీట్లు నిండక ఇబ్బంది పడుతున్న సమయంలో ఫీజులు మరింత పెంచితే ఈ మాత్రం అడ్మిషన్లు కూడా లభించకపోవచ్చన్న ఉద్దేశంతోనే ఇలా స్పందించినట్టు తెలుస్తున్నది. కరోనా కారణంగా చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఫీజులు పెంచితే అసలుకే మోసం వస్తుందన్న అభిప్రాయంతో పలు యాజమాన్యాలు ఉన్నట్టు తెలుస్తున్నది. మరికొన్ని కళాశాలలు చూపించిన ఖర్చుల ప్రకారం భారీగా ఫీజులను పెంచాల్సి ఉన్నప్పటికీ, సదరు యాజమాన్యాలు తక్కువ ఫీజులనే ప్రతిపాదించడం గమనార్హం. దీంతో టీఏఎఫ్ఆర్సీ అధికారులు ఆయా కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులనే పరిగణనలోనికి తీసుకొంటున్నారు.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల మేరకు ఇంజినీరింగ్ ఫీజులను ఏఐసీటీఈ సవరించడంతో విచారణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఏఐసీటీఈ నుంచి మరింత స్పష్టత కోసం ప్రస్తుతానికి ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల విచారణను అధికారులు వాయిదావేశారు. ఏఐసీటీఈ నుంచి స్పష్టత వచ్చే లోపు లా, బీఈడీ, ఫార్మసీ కోర్సుల ఫీజుల సవరణ ప్రక్రియను ప్రారంభించాలని టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. దీనిపై ఆయా కాలేజీలకు సమాచారమిచ్చి విచారణను ప్రారంభించనున్నారు. ఒకే యాజమాన్యం కింద విభిన్న కోర్సులను నిర్వహించే కాలేజీలు ఉంటే, వాటిన్నింటిని ఒకేసారి విచారించనున్నట్టు ఒక అధికారి తెలిపారు.