హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వతంత్ర సంస్థలు బీజేపీకి కీలుబొమ్మలుగా మారాయన్న విమర్శలకు బలం చేకూర్చే విధంగానే వాటి వ్యవహారశైలి ఉంటున్నది. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సంస్థలు బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో పావులుగా మారుతున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే వివిధ కేంద్ర సంస్థలు రాజ్యాంగబద్ధంగా పొందిన సమాచార హక్కును సైతం తుంగలో తొక్కుతున్నాయి.
ఆర్టీఐ కింద దాఖలైన దరఖాస్తులకు సమాధానం ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. ఇందుకు పీఎంవో వ్యవహార శైలే నిదర్శనం. ప్రధానిగా మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్ని దేశాలు పర్యటించారు? అందుకు ఎంత ఖర్చు చేశారు? తదితర వివరాలు తెలపాలని కోరుతూ యూత్ ఫర్ యాంటి కరప్షన్ ఫౌండేషన్(వైఏసీఎఫ్) ప్రతినిధులు సమాచారహకు చట్టం ద్వారా పీఎంవోకు దరఖాస్తు చేశారు. కానీ, ఆ వివరాలు చెప్పేందుకు పీఎంవో నిరాకరించింది. మోదీ పర్యటనల ఖర్చుకు సంబంధించిన లెకలు వెబ్సైట్లో ఉంటాయంటూ అరకొర జవాబు ఇచ్చి చేతులు దులుపుకున్నది. వెబ్సైట్లో ఆ లెక్కల జాడ లేదని వైఏసీఎఫ్ ప్రతినిధులు చెప్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)దీ ఇదే తీరు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎంత నగదు సీజ్ చేశారు? ఎకడెకడ ఎవరి మీద, ఏయే రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహించారు? ఆయా తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న డబ్బు ఎకడ డిపాజిట్ చేస్తున్నారు? ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? ఎంతమందికి శిక్ష పడింది? తదితర సమాచారం ఇవ్వాలని కోరుతూ వైఏసీఎఫ్ ప్రతినిధులు దరఖాస్తు చేయగా, ఆ వివరాలు ఇవ్వడానికి ఈడీ కార్యాలయం నిరాకరించింది.
ఆ వివరాలు చెప్పబోమని ఏకంగా ఈడీ జాయింట్ డైరెక్టర్ రంజన్ప్రకాశ్ స్పష్టం చేయడం గమనార్హం. రైల్వే శాఖదీ అదే తీరు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం వాడిన శానిటైజర్లు ఎన్ని? అందుకు విడుదల చేసిన నిధులెన్ని? ఖర్చు చేసింది ఎంత? అని రైల్వే శాఖను వైఏసీఎఫ్ ఆర్టీఐ ద్వారా ప్రశ్నించింది. తమ దగ్గర అందుకు సమాధానం లేదని కేంద్ర రైల్వే బోర్డు పీఐవో అనురాగ్ గ్రోవర్ సమాధానం చెప్పడం కేంద్ర సంస్థల తీరుకు నిదర్శనం. దాదాపు అన్ని కేంద్ర సంస్థలు ఆర్టీఐ దరఖాస్తులపై ఇదే రీతిన వ్యవహరిస్తున్నాయి. సమాధానం ఇవ్వకపోవడం, లేదంటే అరకొర సమాచారం, పొంతన లేని జవాబులు చెప్పడం, ప్రశ్నలే సరిగా లేవంటూ తిప్పి పంపడం పలు సంస్థలకు రివాజుగా మారింది.
సమాచార చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
వాస్తవానికి తీవ్ర స్థాయి మానవ హకుల ఉల్లంఘనలు తదితర ఘటనలపై ప్రజలకు అవసరమైన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వచ్ఛందంగా సంబంధిత కార్యాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. అదే ప్రాతిపదికన సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అనేక హైకోర్టులు లైవ్ ప్రొసీడింగ్స్ కూడా చేస్తున్నాయి. కానీ ఈడీ వంటి అత్యున్నత స్థాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాత్రం సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. చాలా కేంద్ర సంస్థలదీ ఇదే తీరు. దీనిపై కేంద్ర సమాచార కమిషన్కు సెక్షన్ 18 ద్వారా పిటిషన్ ఫైల్ చేస్తాం.
– రాజేంద్ర పల్నాటి, యూత్ ఫర్ యాంటి కరప్షన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు