హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఆయుష్మాన్ భారత్పై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు సమాధానాలు ఇచ్చింది. నోటికొచ్చినట్టు సమాధానం చెప్పింది. ఒకే ఎంపీ అడిగిన రెండు ప్రశ్నలకు.. ఒకే రోజు రెండు విభిన్న వివరాలు ఇచ్చింది. ఆ ప్రశ్న అడిగింది బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ కావడం విశేషం. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణలో అందించిన సేవల వివరాలను తెలియజేయాలని ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభలో కోరారు. మరో ప్రశ్నలో రాష్ర్టాల వారీగా ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు, వారికి అందిన సేవలను తెలపాలని కోరారు. వీటికి మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఒక ప్రశ్నలో తెలంగాణలో ఇప్పటివరకు ఆయుష్మాన్ భారత్ కింద రూ.2012 కోట్ల విలువైన సేవలు అందాయని పేర్కొన్నది.
ఇందులో కేంద్రం వాటా కింద ఇప్పటివరకు రూ.236.45 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించింది. మరో ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తెలంగాణలో ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.1984 కోట్ల విలువైన సేవలు అందినట్టు తెలిపింది. ఇందులో కేంద్ర వాటాగా రూ.247.17 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నది. ఒకే రోజు… బిల్లులో రూ.28 కోట్లు, కేంద్రం వాటా చెల్లింపులో రూ.10.72 కోట్లు వ్యత్యాసం చూపెట్టడం గమనార్హం. ఇంతకూ ఏది అసలైన లెక్క అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చిన లెక్కలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని పలువురు మండిపడుతున్నారు.