ఎన్నో కేసులను ఎదుర్కొని, మరెన్నో అడ్డంకులను అధిగమించి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరువు నేలపై కృష్ణమ్మను గలగలా పారించేందుకు సీఎం కేసీఆర్ మొక్కవోని సంకల్పంతో ప్రాజెక్టుకు ఎకనామిక్ అడ్వైజరీ కమిషన్ (ఈఏసీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాతలు ఆనందంలో మునిగి తేలారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఏదుల, వట్టెం, నార్లాపూర్ రిజర్వాయర్లలో శనివారం రైతు సంబురాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు జల, క్షీరాభిషేకాలు చేశారు. బైక్ ర్యాలీలు తీసి, పటాకులు కాలుస్తూ అన్నదాతలు ఆనందంలో మునిగితేలారు.
మహబూబ్నగర్/నాగర్కర్నూల్/బిజినేపల్లి/కొల్లాపూర్, ఆగస్టు 12 (నమస్తే తెలం గాణ ప్రతినిధి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విషం కక్కుతూ కోర్టు ల్లో కేసులు వేసినా.. సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమా ర్కుడిలా ఎత్తిపోతల పనులకు పర్యావరణ అనుమతులు తీసుకొ చ్చారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుల రిజర్వాయర్ వద్ద రైతు సంబురాలను ఘనం గా నిర్వహించారు.
ఈ వేడుకలకు నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ వచ్చినంక ఓ పెద్ద ప్రాజెక్టు కట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా కరువును రూపుమా పాలని పదేండ్ల ముందే సీఎం కేసీఆర్ చెప్పారని, 2009లో మహబూబ్నగర్ ఎంపీ అయినంక తెలంగాణ వచ్చేది ఖాయం.. ఈ బీడు వారిన నేలకు కృష్ణమ్మ నీళ్లు పారిస్తాం.. పాలమూరు ఎత్తిపోతల పేరుతో భారీ ప్రాజెక్టును చేపడతామని నాడే చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక గుడిపల్లి, జొన్నలబొగుడ పంప్హౌస్లు నిర్మించినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన ఏడాదిలోనే 2015, జూన్ 11న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎట్లుండా లో ఓ ఇంజినీర్లా సీఎం కేసీఆర్ రూపకల్ప న చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో రైతులు, ప్రజలు బీఆర్ఎస్ను భారీ మెజార్టీ తో ఆశ్వీరదించాలని కోరారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారడంతోపాటు భవిష్యత్తులో కోనసీమను తలపించనున్నదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్ వద్ద ఎమ్మెల్యే మర్రి సమక్షంలో శనివారం రైతు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు కరువుతో అల్లాడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ)కు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇది పూర్తయితే తమకు ఓట్లు పడవన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు కేసులు వేశారని మండిపడ్డారు. వట్టెం రిజర్వాయర్ కోసం రైతులు స్వచ్ఛందంగా దాదాపు ఆరు వేల ఎకరాలను ఇచ్చారని ప్రశంసించారు.
వచ్చే నెలలో పీఆర్ఎల్ఐ మోటర్లను ప్రారంభించనున్నట్టు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి రిజర్వాయర్ నార్లాపూర్ బండ్ (అంజనగిరి)పై హర్షవర్ధన్రెడ్డి నేతృత్వంలో రైతు సంబురాలను ఉత్సాహంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులతో కలిసి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీరం మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల బీడు పొలాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతలను చేపట్టారని చెప్పారు. వచ్చే నెలలో సీఎం కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల మోటర్లు ప్రారంభిస్తారని తెలిపారు.