హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అర్హులైన అంగన్వాడీ టీచర్స్, ఆయాలకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ను కోరారు. హైదరాబాద్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు.
గ్రేడ్-2 సూపర్వైజర్ నియామకాలు వెంటనే చేపట్టాలని, అర్హులైన అంగన్వాడీ ఆయాలకు టీచర్స్గా పదోన్నతులు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కూరగాయల బిల్లులు, గ్యాస్ బిల్లులు, మూడునెలలు ఎరియర్స్ ఇవ్వాలని, ఇంటి అద్దెలు పెంచాలని వినతిపత్రాన్ని కమిషనర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలాసకవి నిర్మల, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రమాదేవి, జంగం రాణి, సహాయ కార్యదర్శి కృష్ణకుమారి, కోశాధికారి వేదవతి, రాష్ట్ర నాయకులు నాగమణి, సంధ్య, రమారజిత తదితరులు పాల్గొన్నారు.
స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వైద్యారోగ్య శాఖ సంయుక్తంగా ములుగులో ఈ నెల 30న పౌష్టికాహారం, వైద్య సంరక్షణపై సమీక్ష నిర్వహించనున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ తెలిపారు. సమావేశానికి అన్ని జిల్లాల సంక్షేమ అధికారులు, సీడీపీవోలు హాజరవుతారని పేర్కొన్నారు.Deserving should be promoted