హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఆర్వో మధుసూదన్ గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం ఛాతినొప్పితో ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. దవాఖానలో కార్డియాక్ అరెస్టు కావడంతో అపోలో స్పెక్ట్రా దవాఖానకు తరలించారు. చికిత్స సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో మరణించారు. మధుసూదన్ స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికల్లో పనిచేశారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సీపీఆర్వోగా సేవలందిస్తున్నారు. మధుసూదన్ మృతిపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్రావు సంతాపం వ్యక్తంచేశారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా మధుసూదన్ కృషి విశిష్టమైనదని హరీశ్రావు గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.