హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వరరావు(70) కన్నుమూశారు. ఆయుర్వేద వైద్యుడుగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన చనిపోయారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని వైరాకు తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేడిగడ్డ పర్యటనను రద్దు చేసుకుని వైర బయల్దేరారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ఎంఐఎం, సీపీఐ శాసన సభ్యులుకూడా వెళ్లనున్నారు. మేడిగడ్డ సందర్శన కోసం ప్రభుత్వం ఆర్టీసీకి చెందిన నాలుగు బస్సులను సిద్ధంచేసింది. అసెంబ్లీ ఆరణకు చేరుకున్న ఆ బస్సులను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు బయల్దేరనున్నాయి.