పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అవసరాలను తీర్చడానికి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం రాత్రి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తిపై సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు జలాశయాల్లో 1000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి మత్స్య సంపదకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా డీపీఆర్లు సిద్ధం చేయాలని సూచించారు. కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి ప్రభుత్వం మొదటి ప్రాధన్యత ఇస్తున్న నేపథ్యంలోనే ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఇరిగేషన్ శాఖ నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే జలాశయాలపై ఫోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తికి ప్రైవేటు ఏజెన్సీలు కాకుండా ప్రభుత్వ సంస్థ సింగరేణి ముందుకురావడం వల్ల అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో 300 మెగా వాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పనులు మొదలు పెట్టామని తెలిపారు.