హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ‘నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పినం.. ఆ విధంగానే సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనకు ముందు ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు, రద్దు, వాయిదాలు, ప్రశ్నపత్రాల లీకులు, పరీక్ష తేదీల ఓవర్ లాప్తో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపించారు.
గత ప్రభుత్వంలో గ్రూప్ 1 పరీక్ష రెండుసార్లు రద్దయిందని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు సీఎం రేవంత్రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కలిసి యూపీఎస్సీ కమిషన్ చైర్మన్ను సంప్రదించారని చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అధ్యయనం చేయించామని తెలిపారు. గ్రూప్-1 నోటిఫికేషన్లో అదనంగా 60 పోస్టులు జోడించి 563 ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశామని వివరించారు. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ప్రకటించామని, ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామని చెప్పారు.
అధికారంలోకి రాగానే 32,410 మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశామని, అదనంగా 13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరిందని తెలిపారు. 11,022 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేశామని చెప్పారు. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్ గురించి చర్చించి ఆమోదించామని, 2024-25 జాబ్ క్యాలెండర్ను సభ్యులందరికీ జారీ చేశామని చెప్పి, జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్టు సభలో ప్రకటించారు.
యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్
ఇది యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్. ఇందులో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు? దరఖాస్తుకు చివరి తేదీ, పరీక్ష నిర్వహణ తేదీ, ఎన్నిరోజులు పరీక్షలు నిర్వహిస్తారనే పూర్తి సమాచారం ఉంటుంది. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన జాబ్క్యాలెండర్లో మాత్రం కేవలం ఏ నెలలో ఏ పరీక్ష నిర్వహిస్తారనే విషయం తప్ప, మిగతా వివరాలు లేకపోవటంపై దీనితో ఒరిగేదేమీ లేదని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు.