Congress | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పక్కన పెట్టేశారా..? ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి వంద రోజులు కూడా కాకముందే ‘వ్యక్తిస్వామ్యం’గా మారిందా..? ప్రజలకు ప్రజాప్రతినిధులకు ‘స్వేచ్ఛ’ కల్పించామంటూ చేసిన ప్రకటనలన్నీ ఉత్తమాటలేనా? ఇకపై మంత్రులకు రోజూ అవమానాలేనా..? ప్రస్తుత పరిణామాలు ఈ వాదనలకు ఊతమిస్తున్నాయి. ఎల్బీస్టేడియంలో సోమవారం 5,192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుల్, మెడికల్ సిబ్బందికి నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల విభాగం నుంచి కొన్ని పత్రికలకు మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చారు. అవికూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకుండా.. మిగతా జిల్లాలకు వెళ్లేలా ప్రకటనలు ఇచ్చారు. ఇందులో సీఎం రేవంత్రెడ్డి ఫొటో మాత్రమే ముద్రించారు. ఇందిరాగాంధీ తప్ప మరో వ్యక్తి ఫొటో కనిపించలేదు. గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంబంధిత మంత్రుల ఫొటోలు ఆ ప్రకటనల్లో ఉండేవి. ఈసారి భట్టితోపాటు సంబంధిత మంత్రులను పక్కన పెట్టేశారు.
సోమవారం ఇచ్చిన నియామకపత్రాల్లో పోలీస్, విద్య, బీసీ సంక్షేమ, వైద్యారోగ్య శాఖలకు చెందిన పోస్టులు ఉన్నాయి. వీటిలో పోలీస్, విద్యాశాఖలు సీఎం వద్దే ఉన్నాయి. మిగతా.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫొటోలైనా వాడటం మర్యాద అని విశ్లేషకులు చెప్తున్నారు. తాజా పరిణామాలను బట్టి భట్టితోపాటు ఇతర మంత్రులందరినీ పక్కన పెట్టేసినట్టేనని.. రేవంత్ మాత్ర మే కనబడాలన్న భావన స్పష్టంగా కనిపిస్తున్నదని అంటున్నారు. ఇది కచ్చితంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహను అవమానించడమేనని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం నుంచి వ్యక్తిస్వామ్యంవైపు మళ్లిందనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు వాస్తవాలు గ్రహించాలని సూచిస్తున్నారు.
ప్రభుత్వ ప్రకటనల నుంచి భట్టి విక్రమార్కను తొలిగించడంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇది ముందుగా ఊహించిన పరిణామమే అని విశ్లేషకులు చెప్తున్నారు. రేవంత్రెడ్డి స్వభావం తమకు ముందు నుంచీ తెలుసని, భట్టి, ఇతర మంత్రులకు ఇస్తున్న ప్రాధాన్యం మూడునాళ్ల ముచ్చటేనని అప్పుడే అనుకున్నామని అంటున్నారు. ప్రజాప్రతినిధులకు అవమానాలు కాంగ్రెస్ పార్టీలో కొత్తేం కాదని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇన్నాళ్లూ తొడుక్కున్న ‘అందరం ఒక్కటే’ అనే ముసుగు తొలిగిపోయి ‘అంతా ఒక్కడే’ అనే అసలు రంగు బయటపడిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. భట్టి ఫొటో తీసేయడం ద్వారా రేవంత్ఆయనకు బైబై చెప్పేశాడని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. రానురాను ఇలాంటివి ఇంకెన్నో చూడాల్సి వస్తుందని, కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలంటూ సలహాలు ఇస్తున్నారు.