హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఇటీవల మృతి చెందిన తన పీఆర్వో మధుసూదన్ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, రాజకీయ వర్గాలు, జర్నలిస్టు వర్గాలు భట్టి విక్రమార్క తీరుపై విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. భట్టి విక్రమార్క వద్ద సీపీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ సోమవారం గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. సాధారణంగా ఎవరైనా దగ్గరి బంధువులో, స్నేహితుల్లో మృతి చెందినప్పుడు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం సర్వసాధారణం. కానీ, మధుసూదన్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుకు గురైనప్పటికీ, భట్టి విక్రమార్క మాత్రం ఆయనకు నివాళి అర్పించేందుకు వెళ్లలేదు.
ఆ మరుసటి రోజు మిర్యాలగూడలో జరిగిన అంత్యక్రియలకు సైతం హాజరుకాలేదు. మధు అంత్యక్రియలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హాజరై రూ.5 లక్షల సాయం అందజేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు సైతం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కానీ, అంత్యక్రియలకు భట్టి పేషీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మధుసూదన్కు, భట్టికి దాదాపు 20 ఏండ్ల నుంచి అనుబంధం ఉన్నది. ఖ మ్మం జిల్లాలో జర్నలిస్టుగా ఉన్న సమయం నుంచీ ఆయనకు భట్టితో అనుబంధం కొనసాగుతున్నది. గతంలో సీఎల్పీ నేతగా భట్టి నిర్వహించిన ప్రజాయాత్రలోనూ మధుసూదన్ వెన్నంటి ఉన్నారు. పీఆర్వోగా కూడా ఉదయం నుంచి భట్టి వెంటే ఉంటారు. అంతగా అనుబంధం ఉన్నప్పటికీ ఆఖరిచూపునకు భట్టి హాజరుకాకపోవడమే చర్చనీయాంశంగా మా రింది. ‘మరీ.. ఇంత దారుణమా?’ అని మధుసూదన్ సన్నిహిత వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.