Bhatti Vikramarka | భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పవర్ సెక్టార్లపై అప్పులు ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్తు కొనటానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని, రాష్ట్ర విభజన నాటికి రూ.7,250 కోట్ల అప్పులు ఉండగా, యాదాద్రి పవర్ ప్రాజెక్టు కోసం రూ.50 వేల కోట్లు అప్పులు చేసిందని తెలిపారు. అప్పుల నుంచి బయటపడాలంటే అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నారు.
పవర్ సెక్టార్లను లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్)ను సందర్శించిన ఆయన.. సీఎండీ రిజ్వీతో కలిసి సమీక్ష నిర్వహించారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో విద్యుత్తు ఉత్పత్తిలో సాంకేతికతను ఉపయోగించుకోవాలని, పర్యావరణంపై ప్రభావం పడకుండా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. సబ్క్రిటికల్ విధానంతో పర్యావరణంపై ప్రభావం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కొత్త విధానానికి ప్రణాళిక తయారు చేశారని గుర్తుచేశారు.
సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడుకోవాలని, సహజ వనరులను కాపాడి, భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు. రైల్వే లైన్ నిర్మాణ పనులు 40 శాతం పూర్తి కాగా, ఇంకా 30 శాతం పనులు భూసేకరణ ప్రక్రియలో ఉన్నాయని వివరించారు. సమీక్షలో ప్రత్యేక అధికారి కృష్ణభాస్కర్, సీఈ బిచ్చయ్య, జేసీ రాంబాబు పాల్గొన్నారు.
బీటీపీఎస్ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేవలం అప్పులు లెక్కలు చెప్పి అధికారులతో సమీక్ష ముగించారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు కట్టకుండానే రూ.22 వేల కోట్లు అప్పు చేసిందని గుర్తుచేశారు. హామీల అమలును తప్పించుకొనేందుకే అప్పుల పాట పాడుతున్నారని ఆరోపించారు.