హైదరాబాద్, జనవరి 19(నమస్తే తెలంగాణ): యాసంగి సాగు జోరుగా కొనసాగుతున్నది. గురువారం నాటికి రాష్ట్రంలో 39 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత యాసంగితో పోల్చితే 100 శాతం సాగు విస్తీర్ణం పెరగడం గమనార్హం. నిరుడు ఇదే సమయానికి 18 లక్షల ఎకరాల్లోనే వివిధ పంటలు సాగయ్యాయి.
ఈ సీజన్లో వరి సాగుపై అధిక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే 27 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. నిరుడు ఈ సమయానికి 7 లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది. అంటే, గతంతో పోల్చితే వరి సాగు నాలుగు రెట్లు పెరిగింది. మరో నెల వరకు వరి సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుడు 2.23 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు కాగా, ఇప్పటికే 4 లక్షల ఎకరాలు దాటింది. శనగ పంట 3.35 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 2.13 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.